తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర ఇవాళ శనివారం అన్న క్యాంటిన్ను ప్రారంభించారు. ఈ అన్న క్యాంటిన్ ద్వారా పేదలకు రూ. 2కే భోజనం అందించనున్నారు. బాలకృష్ణతో పాటు అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. నేడు ఈ క్యాంటిన్ను ప్రారంభించిన వసుంధర మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కోడలు అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
‘‘ఎన్నారై ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి బాలకృష్ణ గారు కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రూ. 2కే భోజనం. ఇలాంటిది ఎక్కడ చూసి ఉండరు. నందమూరి పురంలోనే ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుంటుంది. మా మామ గారు ఎన్టీఆర్.. పైనుంచి ఇవన్నీ నడిపిస్తున్నారు’’ అని వసుంధర చెప్పారు. అయితే వసుంధర మాట్లాడుతున్న సందర్భంగా హిందుపురంను నందమూరి పురం అని వ్యాఖ్యానించడం గమనార్హం.
గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ కూడలిలో అన్న క్యాంటీన్ ప్రారంభం
మరోవైపు గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ కూడలిలో అన్న క్యాంటిన్ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ శనివారం అన్న క్యాంటిన్ను ప్రారంభించారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం, బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ. 5కు భోజనం అందజేయనున్నారు. నేడు ఈ అన్న క్యాంటీన్ను టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. మహానాడుకు స్పందన చూసి వేసీపీ నేతలకు వణుకు పుట్టిందన్నారు.