కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం, నాంది వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. అల్లరి నరేష్ 59వ చిత్రమిది.
సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, బంగార్రాజు వంటి వరుస సక్సెస్ఫుల్ మూవీస్ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో, మరో నిర్మాణ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాత. ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు.
మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్ గమనిస్తే.. నరేష్ మంచం ఓ చివరన పట్టుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఎవరినో నరేష్ మోస్తున్నట్లు అనిపిస్తుంది. తలకు, చేతికి గాయాలు కనపడుతున్నాయి. నరేష్ ఓ ఇన్టెన్స్ లుక్తో కనిపిస్తున్నారు.సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.